Sunday, January 11, 2015

వివేకానందుడు


వివేకానందుడు
★☞_/||\_☜★
భారత ఉపఖండం చీకటి ఖండమైన కాలమది. బ్రిటిష్ పాలనలో
భారతీయులు బానిస మనస్కులై నిర్వీర్యమైపోతున్న
యుగమది.
మూఢాచారాలే మతంగా, తంత్రమూ మంత్రమే మోక్షంగా,
సాటివారిని హీనంగా చూడటమే కులంగా, మెట్టవేదాంతమే
తత్త్వశాస్త్రంగా, పాశ్చాత్యులే గొప్పవారుగా చలామణీ
అవుతున్న
శతాబ్దమది. అలాంటి స్తబ్దమైన సంఘాన్ని తట్టిలేపిన
వైతాళికుడు
వివేకానందుడు.
భారతదేశాన్ని ప్రేమించడమెలాగో, ఉద్ధరించడమెలాగో నేర్పిన
మహనీయుడు. ‘‘ఓ తేజస్వరూపా! జననమరణాలకు అతీతుడా!
మేలుకో. బలహీనతల్ని తొలగించుకో. పౌరుషాన్ని ప్రసాదించుకో.
మనిషిగా మసలుకో. లే. లెమ్ము’’
అంటూ యువతను జాగృతం చేసిన వేదాంతభేరి స్వామి
వివేకానంద!
1863 జనవరి 12, సోమవారం!
ఉదయం 6 గంటల 49
నిమిషాలు. కలకత్తాలో
భువనేశ్వరీదేవి పండంటి
మగబిడ్డను కన్నది. తండ్రి
విశ్వనాథ్ దత్తా ఆ పిల్లాడికి
నరేంద్రనాథ్ అనే
పేరు పెట్టారు. నరేన్ అల్లరి
గడుగ్గాయి. గిన్నెలు, చెట్లు,
రాళ్లు – అన్నీ ఆ
చిచ్చరపిడుగుకి ఆటవస్తువులే!
పిల్లల్లోని అంతర్గత అనంత శక్తే అల్లరిగా
ఎగదన్నుకొస్తుంది. ఆ దివ్యశక్తిని వెలికి తీయడమెలాగో
భువనేశ్వరికి తెలుసు. రెచ్చిపోయే నరేన్ నెత్తిపై శివ శివ
అంటూ బిందెడు నీళ్లు గుమ్మరించేది. బుద్ధిగా ఆ
పిల్లాడిని కూచోబెట్టేది. రామాయణ భారత శ్లోకాల్ని వల్లె
వేయించేది. అందుకే ‘‘నాలోని మానసిక అభ్యుదయానికి, ధార్మిక
శక్తికి, సంస్కారానికి మా అమ్మే కారణం’’ అనేవారు స్వామి
వివేకానంద.
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నెలకొల్పిన బడిలో 1870లో నరేన్ ఒకటో
తరగతిలో చేరాడు. చిన్నప్పుడే వేణీగుప్త, ఉస్తాద్ అహ్మద్ఖాన్
దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. హార్మోనియం, ఫిడేల్పై
పట్టు సాధించాడు. న్యాయవాది అయిన విశ్వనాథ్ దత్తా తన
కొడుక్కి న్యాయశాస్త్రం, సైన్సు పుస్తకాల్ని
ఉద్దేశపూర్వకంగా ఇస్తూండేవారు. ఉపనిషత్తుల్ని,
పురాణాల్ని చదివిస్తూండేవారు. ఆయా విషయాలపై కావాలని
వాదనపెట్టి చర్చిస్తూండేవారు.
ఏ విషయాన్నయినా తర్కంతో హేతుబద్ధంగా పరిశీలించే శక్తి
నరేన్కి అలవడింది ఈ శిక్షణ వల్లనే!
చిన్నప్పటినుంచీ నరేంద్రుడికి ధ్యానం ఓ నిత్యక్రీడ.
పద్మాసనం వేసుకుని కళ్లు మూసుకుని ధ్యానంలోకి
వెళ్లిపోతే సమస్త ప్రపంచాన్నీ మరచిపోయేవాడు. అత్యంత
తీక్షణమైన ఏకాగ్రత వివేకానందుడికి అబ్బింది ఈ
ధ్యానం వల్లనే.
ఏవేవో ప్రశ్నలు…
1879లో 16 యేళ్ల నరేన్ ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు.
రోజూ వ్యాయామం చేసేవాడు. వస్తాదులా ఉండేవాడు.
కర్రసాము, గుర్రపుస్వారీ, కుస్తీ, పడవ నడపడం,
పరిగెత్తడం, ఈతకొట్టడం… ఒకటా రెండా
అన్నింటిలోనూ ప్రవేశించడం, అంతు చూడటం… ఇదీ
వరస! చివరకు పాకశాస్త్రంలో కూడా గరిటె తిప్పిన చెయ్యి
నరేన్ది!
మరోపక్క హెర్బర్ట్ స్పెన్సర్, జాన్ స్టువర్ట్ మిల్, అగస్టె కామ్టె,
అరిస్టాటిల్, డార్విన్ లాంటి పాశ్చాత్యుల గ్రంథాల్ని
అధ్యయనం చేశాడు. దేశ చరిత్రల్ని, ప్రాక్పశ్చిమ
తత్త్వశాస్త్రాల్ని, తర్కం, క్రైస్తవ మహ్మదీయ బౌద్ధమత
గ్రంథాల్ని ఆకళించుకున్నాడు. వివిధ దేశాల్లో వివిధ
పరిస్థితుల్లో మానవ సమాజాలు ఎలా పరిణామం చెందాయో
అవగతం చేసుకున్నాడు.
అయితే భారతీయ సంస్కృతి, మతం, తత్త్వ చింతనలపై
మమకారం ఓ వైపు; ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు,
హేతువాదం పట్ల మక్కువ మరోవైపు – ఈ రెంటి మధ్య నలిగి
మధనపడ్డాడు. భగవంతుడు లేడనీ భౌతిక దృగ్విషయాలే
సత్యాలనీ చెప్పే పాశ్చాత్య సైన్సులో లోపం ఉందని
హృదయానికి అనిపించేది. సనాతన భారతీయ భావజాలం భౌతిక
దృష్టి కొరవడి వక్రీకరణకు గురైందని బుద్ధికి తోచింది.
తత్ఫలితంగా ఏవో ఏవేవో ప్రశ్నలతో వేగిపోయేవాడు. ఏవో ఏవేవో
ఘోషలతో ఊగిపోయేవాడు. సమాధానాల కోసం బ్రహ్మ సమాజంలో
చేరాడు. అయినా సంతృప్తి లేదు.
నిర్వికల్ప సమాధి…
1881లో స్కాటిష్ చర్చి కాలేజీలో బీఏలో చేరాడు నరేంద్రుడు.
ఓ రోజు క్లాసులో ప్రిన్సిపాల్ విలియం హేస్టీ – వర్డ్స్వర్త్
కవిత ‘ది ఎక్స్కర్షన్’ గురించి చెబుతున్నారు. ఆ మాటల్లో
‘సమాధి అవస్థ అనే ఆత్మానందాన్ని అనుభవిస్తున్నది
తనకు తెలిసి రామకృష్ణ పరమహంస’ అని హేస్టీ అన్నారు.
నరేన్కి మెరుపులాంటి ఆలోచనొచ్చింది. వెంటనే కలకత్తాకి
దగ్గర్లోని దక్షిణేశ్వరం వెళ్లాడు.
ఉసిరిచెట్టు కింద మాసిన గడ్డంతో ఒంటిపై ఒక్క
అంగవస్త్రం తప్ప మరే ఆచ్ఛాదనా లేని అలౌకిక ధ్యానముద్రలో
పరమహంస… దివ్యోన్మాదంతో కాళికాదేవి సాక్షాత్కారం కోసం నేలపై
దొర్లి ఏడ్చి చివరకు భగవద్దర్శనం పొందిన పరమహంస…
ప్రతిరోజూ గంగలో వెండి నాణాల్ని విసిరేసి
ధనవ్యామోహం వదిలించుకున్న పరమహంస… బ్రాహ్మణుడే
అయినా పంచముల ఇళ్లకు వెళ్లి, వారు చూడని సమయాల్లో
వారి పాయిఖానాల్ని వొట్టి చేతులతో శుభ్రం చేసిన పరమహంస…
సన్నిధిలోకి అడుగుపెట్టాడు నరేన్.
ఆయన పాడమంటే – కనులు మూసుకుని బాహ్య
ప్రపంచాన్ని మరచిపోయి తన్మయీభావంతో గాన ధ్యాన
సమాధ్యవస్థలో ‘‘మన్ చలో నిజనికేతన్’’ (మనసా! మన చోటుకి
వెళ్లిపోదాం) అన్న కీర్తన పాడాడు. పాట
వింటూ పరవశులైపోయారు పరమహంస.
హఠాత్తుగా నరేన్ చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి
తలుపులేసేశారు. కళ్లల్లో ఆనంద భాష్పాలతో
‘‘ఇన్నాళ్లకు వచ్చావా?’’
అంటూ నరేన్ను స్పృశిస్తూ ఆర్ద్రమైపోయారు. అంతటి
తాదాత్మ్యతలోనూ నిశ్శబ్దాన్ని
చీలుస్తూ నరేంద్రుడు సూటిగా వదిలిన ప్రశ్నాబాణం –
‘‘మహాశయా! మీరు దేవుణ్ని చూశారా?’’
ఏమాత్రం తడుముకోకుండా ‘‘చూశాను’’
అన్నారు రామకృష్ణులు.
సంభ్రమాశ్చర్యానందాలతో నరేన్…
ఇన్నాళ్లుగా ఎందరెందరినో ఉన్మత్తుడిలా అడిగిన ప్రశ్న అది.
ఎన్నాళ్లుగానో చకోరంలా ఎదురుచూస్తున్న జవాబది.
మళ్లీ రామకృష్ణులు ‘‘నిన్ను చూస్తున్నట్లే
భగవంతుణ్ని చూశాను. నేను నిన్ను ఇప్పుడు ఎలా
చూస్తున్నానో అలాగే మనమూ భగవంతుణ్ని చూడొచ్చు’’
అన్నారు.
ఈ సంఘటన నరేన్ మనసులో గొప్ప విప్లవాగ్ని రగిలించింది.
గదులు, తలుపులు, కిటికీలు, చెట్లు,
సూర్యచంద్రులు, నక్షత్రాలు – అన్నీ
ఎగిరిపోతున్నట్లు, తునాతునకలై
అణువులు పరమాణువులుగా విడిపోయి ఆకాశంలో
లీనమైనట్లు అనిపించింది. నేను అనే మాయ మాయమై విశ్వ
చైతన్యమే నేనుగా భాసించింది.
నరేంద్రుడు వివేకానందుడిగా మారడం మొదలైందప్పుడే!
అప్పటినుంచి పరమహంస వద్దకు నిత్యం ఏవో ప్రశ్నలతో
వెళ్తుండేవాడు. అప్పుడప్పుడు గురువుతో
వాదించేవాడు. ఓ దశలో తానూ నిర్వికల్ప సమాధిని పొందాలన్నంత
ఆవేశవశుడయ్యాడు.
కష్టాలెన్నో…
అంతలో 1884లో తండ్రి విశ్వనాథ్ దత్తా మరణించారు.
అంతవరకు బాగా బతికిన కుటుంబం వీధినపడింది.
పెద్ద కొడుకుగా నరేన్పై ఇంటి భారం పడింది. ఆకలితో
ఉత్తకాళ్లతో మండుటెండలో కాళ్లు బొబ్బలెక్కినా ఆఫీసుల
చుట్టూ తిరగాల్సిన దీన స్థితి. ఇంటిలో అన్నం ఉండదని
తెలిసి స్నేహితుల ఇళ్లల్లో తినేశానంటూ కన్నతల్లికే
అబద్ధం చెప్పాల్సిన హీన స్థితి.
డబ్బు సాయం చేస్తామంటూ ఒకరిద్దరు సంపన్న
స్త్రీలు అతి జుగుప్సాకర ప్రతిపాదన చేస్తే ఛీకొట్టిన ధీర
స్థితి.
చివరకు ఓ న్యాయవాది దగ్గర అనువాదం చేసే
ఉద్యోగం దొరికింది – బొటాబొటీ జీతానికి! కానీ తాను జన్మించింది
ఇందుకోసం కాదని తెలుసు. అలాగని బాధ్యతల నుంచి
తప్పుకోలేననీ తెలుసు. సరిగ్గా అదే సమయంలో 1885లో
రామకృష్ణులు గొంతు క్యాన్సర్కి గురయ్యారు. ఆయన
నిర్యాణం చెందడానికి ముందురోజు నరేన్తో, ‘‘నేను ఇచ్చిన
శక్తితో ప్రపంచానికి సేవ చెయ్యి’’ అన్నారు.
22 యేళ్ల లేత వయసులో ఉన్న నరేన్కి ఆ మాట రామబాణమైంది.
తనవారిని విడిచిపెట్టేశాడు. తోటి శిష్యులతో కలిసి బారానగర్లో ఓ
పాడుబడిన ఇంటిలో ‘రామకృష్ణమఠం’ స్థాపించారు. జపం,
ధ్యానం, వేదాంత చర్చ, ఉంటే తిండి, లేకుంటే పస్తులు,
చింపిరి దుస్తులు, కటిక నేలపై నిద్ర, యోగసాధన – రెండేళ్ల
పాటు ఇదే జీవితం!
ఆపై సన్యాసం స్వీకరించి స్వామీ వివిదిశానందగా
పేరు మార్చుకున్నారు. కాషాయవస్త్రాలు,
నడుముకు దిట్టచేల, తలకు పాగా, ఓ చేతిలో కమండలం, మరో
చేతిలో భగవద్గీత… ఇంతే! 1888 నుంచి 5
ఏళ్లపాటు భిక్షాటనంతో దేశాటనం. ఎన్నెన్ని ప్రాంతాలు తిరిగారో…
పట్టణాల్లోని మురికివాడల్లో, పల్లెల్లోని పేదల గుడిసెల్లో…
ఎక్కడెక్కడ సంచరించారో! వాస్తవ విషాద భారతదేశాన్ని కళ్లారా
చూశారు.
వివేకవాణి…
చివరకు 1892 డిసెంబరు 25న కన్యాకుమారి చేరారు.
అది మూడు సముద్రాల కూడలి. భారతదేశపు చిట్టచివరి కొన…
సముద్రంలో దూరంగా కొండ… సాగరాన్ని ఈది ఆ
గుట్టను చేరారు స్వామి. అక్కడ విశాల వినీల ఆకాశం కింద
ప్రశాంతంగా మౌనంలో ధ్యానంలో సాగర తరంగాల నిర్ణిద్ర
సంగీతం వింటూ మూడు రోజులు గడిపారు.
ఆ కొండపై మాతృభూమికి అభిముఖంగా నిలబడితే ఎదురుగా
వేదోపనిషత్తులకు, ధార్మికతకు, నైతికతకు పుట్టినిల్లయిన
పునీత భారతదేశం… పారతంత్య్రం, దుర్భర దారిద్య్రం,
కులమత విభేదాలు, అంతులేని అజ్ఞానం, నిస్తేజమైన
యువత తనకోసం బతకడమే బతుకు అని
భ్రమిస్తూ నిర్వీర్యమైపోతున్న భరతజాతి… తలచుకుంటే
స్వామికి గుండె తరుక్కుపోయింది.
నయనాలు రెండూ అశ్రుసాగరాలయ్యాయి.
తన విధ్యుక్త ధర్మం తెలిసొచ్చింది.
‘‘పేదల్లో పీడితుల్లో అంధుల్లో కుష్టురోగుల్లో
ప్లేగు బాధితుల్లో… భగవద్దర్శనం అయ్యింది. ప్రాచీన
భారతీయంలో దాగిన పటిష్ఠ నైతిక సూత్రాల్ని, ధార్మికతలోని శీల
నిర్మాణాన్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచ శిఖరాగ్రాన నిలబడి
ఎలుగెత్తి చాటాలి. వేదాంత శంఖం పూరించాలి. ఇదే నా జీవిత
కార్యం’’ అని అనుకున్నారు స్వామీజీ.
చికాగో (అమెరికా)లో జరగబోయే విశ్వమత సదస్సును ప్రథమ వేదిక
చేసుకున్నారు. వివేకానందుడిగా పేరు మార్చుకుని 1893 మే
31న బొంబాయి తీరంలో బయలుదేరారు. ఆగస్టు 20కి చికాగో
చేరుకున్నారు.
1893 సెప్టెంబర్ 11. విశ్వమత మహా సభాప్రాంగణం.
వేదికపై స్వామి వివేకానంద.
అయిదడుగుల ఎనిమిదంగుళాల పొడగరి. విశాలమైన నుదురు,
వెడల్పయిన నేత్రాలు. తీక్షణమైన చూపులు. బలమైన ఛాతి.
నిండైన విగ్రహం. మళ్లీ మళ్లీ చూడాలనిపించే రూపం.
రాజఠీవి. దర్పం. సరస్వతీదేవికి నమస్కరించి, ‘‘అమెరికా సోదర
సోదరీమణులారా’’ అంటూ ప్రసంగం ప్రారంభం. అంతే. ఆ
ఒక్క పిలుపుతోనే 7000 మంది ఒక్కసారిగా లేచి నిలబడి
రెండు నిమిషాల పాటు కరతాళ ధ్వనులతో పులకించిపోయారు.
ఆ క్షణం నుంచి ఏడేళ్ల పాటు వివేకానందుడు అమెరికా,
ఇంగ్లండ్, భారత్… ఇంకా అనేకానేక ప్రాంతాల్లో వివేకవాణి
వినిపించారు. 1902 జూలై 4 శుక్రవారం రాత్రి 39వ యేట
తనువు చాలించారు. ‘కాలక్రమంలో ఎందరో
వివేకానందులు ఉద్భవిస్తారు’ అన్నది ఆయన ఆఖరిమాట.
స్వామీ! ఈ దేశంలోని యువతీ యువకులందరి కండరాల్లోని
ప్రతికణంలోనూ నీ దేహపు ప్రత్యణువునీ ప్రవహించనీ.
నిప్పు కణికలై ప్రజ్వరిల్లనీ. అపుడే… నీ
స్వప్నం నిజమవుతుంది. ఈ స్వర్గం రుజువవుతుంది.
రామకృష్ణ పరమహంస వద్ద నాలుగేళ్ల శుశ్రూషలో
నరేంద్రుడు నేర్చుకున్నవి ఎన్నో! ప్రాచీన కాలపు గ్రీసులో
సోక్రటీసు గొప్ప గురువు. ప్లేటో గొప్ప శిష్యుడు. మళ్లీ
మానవ చరిత్ర పరిణాహంలో గురువంటే రామకృష్ణుడు.
శిష్యుడంటే వివేకానందుడు. భారతదేశాన్ని చదవాలంటే
వివేకానందుణ్ని చదివితే చాలు. శ్రద్ధ, నిస్వార్ధమే శిష్యరికానికి
గీటురాళ్లని, దరిద్ర నారాయణసేవే పరమధర్మమని ఆయన
అన్నారు.
కర్మ, భక్తి, రాజ, జ్ఞాన యోగాలపై ఆయన చేసిన
రచనలు ఆత్మశక్తిని వెలికితీసే ఆయుధాలు. గాంధీ లాంటి
అహింసామూర్తులకూ, సుభాష్ చంద్రబోస్, అరవింద్ ఘోష్,
జతిన్దాస్లాంటి అతివాదులకూ వివేకానందుడి మాటలే
బాటలయ్యాయి.
Like ·  · 

బాపూతత్త్వం

బాపూతత్త్వం
☞_/||\_☜
చెరగని చిరునవ్వు. ప్రశాంతమైన ముఖం. మృదువైన
మాటలు. వ్యక్తిత్వాన్ని స్వయంగా పెంపొందించుకోవడం.
ఇవి ఆయనలోని ప్రత్యేక లక్షణాలు. అహింసనే ఆయుధంగా
స్వీకరించాడు. సత్యవ్రతాన్ని జీర్ణించుకున్నాడు.
పరుషవాక్కుకు దూరంగా ఉన్నాడు.
సాత్వికాహారం తీసుకున్నాడు. ప్రకృతితో మమైకమై జీవనాన్ని
సాగించాడు. ప్రజలతో సహజీవనం చేసి ‘నాయకుడు అంటే ఇలా
ఉండాలి’ అని ఆచరణపూర్వకంగా చూపాడు. కోట్లాది
భారతీయుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
మహత్ముని ఆశయం...
‘గ్రామాల్లోనే భారతదేశం ఉంది. గ్రామాలు అంతరిస్తే
భారతదేశం అంతరించినట్లే. అందుకోసమే గ్రామాల్లో
కుటీరపరిశ్రమలను, ఇతర చిన్నతరహా
పరిశ్రమలను స్థాపించేలా ప్రోత్సహించాలి’… ఇది మహాత్ముని
ఆశయం. భారీ పరిశ్రమల పట్ల తన వైముఖ్యాన్ని ప్రకటిస్తూ,
రాజకీయ, ఆర్థిక వికేంద్రీకరణే గ్రామీణాభివృద్ధికి అవసరమని
పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతి ఏ ఒక్కరిదీ కాదు…
‘భారతీయ సంస్కృతి అందరి భావాల మిశ్రమం. ఇంట్లో అన్ని
భాగాలలోకి వెలుగునిచ్చే సంస్కృతి నాది’ అన్నారు గాంధీజీ.
ఆయనకు భారతీయ సంస్కృతి అంటే వల్లమాలిన అభిమానం.
ఆయన సిద్ధాంతవేత్త కాదు. కాని నమ్మిన సిద్ధాంతాన్ని పాటించే
వ్యక్తి. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఇంక
తిరుగులేదు. అదే ఆయనను బలమైన శక్తిగా
రూపొందించింది. ఆయన
సిద్ధాంతాలను వ్యతిరేకించినవారు సైతం ఆయనను జాతిపితగా
కీర్తిస్తున్నారు. సామాన్యుడిగా జన్మించినప్పటికీ భారతావనికి
జాతిపితగా కీర్తి పొందారు. స్వాతంత్య్ర సాధనకు ఆయన చేసిన
సేవ ఒక ఎత్తయితే, మహాత్ముడిగా మానవాళికి అందించిన
సేవలు మరో ఎత్తు.
స్వయంగా ఎదిగినవాడు…
మహాత్ముడు తనకు తానుగానే ఎదిగిన మహోన్నత
ప్రజానాయకుడు. ఆయనలో ఉన్న నైతికవర్తనే
ఆయనను నేతను చేసింది. ‘రవి అస్తమించని బ్రిటిష్
సామ్రాజ్యమ’ని విర్రవీగిన ఆంగ్లేయులను… చేతిలో
ఆయుధం లేకుండా, సత్యాగ్రహమనే ఆయుధంతో పారదోలిన
వీరుడు.
భిన్నత్వంలో ఏకత్వం…
సామాన్యుల్లో ఎంతో ప్రభావం చూపిన ఆయన ఆలోచనలు,
ఆచరించిన విధానాలు ఈనాటికీ ప్రపంచ
దేశాలు గుర్తిస్తున్నాయి. తాను అనుసరించనిదేదీ
ఇతరులకు చెప్పలేదు. సత్యం, అహింసల ప్రేరణతో
దేశస్వాతంత్య్రం కోసం ఆయన చేసిన సహాయ
నిరాకరణోద్యమం ప్రజలందరినీ ఒకచోటకు చేర్చి, జాతీయభావాన్ని
పెంపొందించింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించారు.
హింస, రక్తపాతం, మతకల్లోలాలకు వ్యతిరేకంగా ఆయన
నిర్వర్తించిన పాత్రను ‘ఒన్మాన్ ఆర్మీ’గా భారత తొలి గవర్నర్
జనరల్ మౌంట్బాటన్ అభివర్ణించారు. వేలాది సైనికులు చేయలేని
శాంతిస్థాపనను ఆయన ‘ఒక్కరే’ సాధించారని కొనియాడా రు.
అంతవరకు వారు చూసిన నేతలకు, గాంధీజీకి మధ్య ఉన్న
తారతమ్యాన్ని గమనించారు.
నెహ్రూ ప్రశంస…
జవహర్లాల్ నెహ్రూ రచించిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’లో…
‘‘తాను చెప్పిన మాటల్నే ఆయన కొలబద్దగా తీసుకుని
అనుసరించేవారు. తానెన్నుకున్న మార్గాన్ని
అనుసరించడంలో అవరోధాలు కలిగినప్పుడు వాటిని
అధిగమించేందుకు ప్రయత్నించేవారు. తన మాటలకు,
మార్గానికి తానే ప్రారంభకుడు అయ్యేవారు. సత్యం,
అహింసల నేపథ్యంలో నైతికవర్తనకున్న ప్రాముఖ్యతను,
దానివలన అలవడే క్రమశిక్షణను గమనించారు’’ అని
వివరించారు.
అందరికీ అనుసరణీయం…
ఒకరి మార్గం మరొకరికి అపమార్గంగా కనబడవచ్చు. ఒకరి
విధానం ఇంకొకరికి అనుసరణీయం కాకపోవచ్చు. కానీ గాంధీజీ
అనుసరించిన మార్గమే తమకు సమ్మతమని భారతీయులంతా
భావించారు. ఆయన నెలకొల్పిన ఈ నాయకత్వ లక్షణాలు ఇప్పటికీ
ప్రపంచదేశాలను ఆకర్షిస్తున్నాయి.
జాతిభేదాలు వద్దు… మనిషిని మనిషిగా చూడు
ఒకసారి మాటల సందర్భంలో
‘మీరు స్వదేశీయులను ప్రేమించినంతగా
విదేశీయులను ప్రేమించరు కదా!’ అని ఒక
ఆంగ్లేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన,
‘నేను మనిషిని మనిషిగానే చూస్తాను. స్వదేశీయుడా?
విదేశీయుడా? అన్నది ముఖ్యం కాదు. పొరుగువాడికి
తోడ్పడమే మానవసేవ’ అని చెప్పారు. ఈ సందర్భంలోనూ ఆ
వ్యక్తి, ‘ముస్లింలీగ్కు ఎందుకు తోడ్పడం లేదు’ అని
మరో ప్రశ్న వేశాడు. ‘సహకరించడానికి నాకేమీ
అభ్యంతరం లేదు. అయితే, నా మార్గంలో లేనివారిపై నా
సేవలను రుద్దలేను’ అని జవాబిచ్చారు.
దేవాలయాలలోకి…
హరిజనుల దేవాలయ ప్రవేశానికి సంబంధించి ఆయన, ‘ఒకసారి
వారిని దేవాలయంలో ప్రవేశించడానికి అనుమతించిన తరువాత
వాళ్లు లోపలికి వస్తారా? రారా? అనేది సమస్య కాదు. దేవాలయ
ప్రవేశానికి తమకు హక్కు ఉందని హరిజనులు వాదించే ప్రశ్నా
కాదు. వారికి కూడా దేవాలయ ప్రవేశార్హత ఉందని
భావించడం ప్రతి ఒక్కరి బాధ్యత’ అన్నారు.
ఆయన చెప్పిన ప్రతి మాటలోనూ సత్యాహింసలు ఉంటాయి. ఆ
రెండూ జీవితాంతం ఆయనతో అంటిపెట్టుకునే ఉన్నాయి.
స్వాతంత్య్ర సముపార్జనలో ప్రజలశక్తి ఆయనే. ప్రజల
విశ్వాసం ఆయన పట్లే. జనానికి దూరంగా ఆయన ఏనాడూ లేరు.
‘నేత అనేవాడు జనంతోనే మమైకమైపోవాలి. వారితో కలిసే పనిచేయాలి.
వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. వారి ఇష్టాయిష్టాల్ని
తెలుసుకోవాలి’ అని ఆచరించి చూపించారు. నిజమైన నేతగా
విశ్వాసం పొందాలంటే ఇంతకంటే కావలసినదేముంటుంది?
నిరుపేద కూడా ‘ఇది నా దేశం’ అని భావించే
భారతదేశం కోసం పాటుపడతాను, పేదలకు ఆహారం రూపంలో
పరమాత్ముడిని అందించాలి… అని ఆలోచించిన గాంధీజీని
స్మరించుకోవడం భారతీయుల ధర్మం.
విడిచిపెట్టవలసినవి…
గాంధీజీ సూచించిన ఏడు విసర్జనీయ సూత్రాలు నేటికీ
అనుసరించదగినవి.
సోమరితనం, ఇతరులకు నచ్చని విధంగా నడుచుకోవడం,
వ్యక్తిత్వం లేని జ్ఞానం,నైతికత లేని వ్యాపారం,
మానవత్వం లేని విజ్ఞానం, త్యాగంలేని
మతం,సిద్ధాంతం లేని రాజకీయం.
వీటిని తప్పనిసరిగా విసర్జించాలని చెప్పారు. అంతేకాక వీటిని
అనుసరిస్తే దేశానికి, సమాజానికి వాటిల్లే నష్టాలను కూడా
తెలియజెప్పారు.
మాటలో శక్తి…
సహాయ నిరాకరణ ప్రారంభించినప్పుడు… ఒకచోట
ప్రజలు పోలీసు స్టేషన్ తగులబెట్టి హింసకు పాల్పడ్డారని
తెలిసి, మొత్తం ఉద్యమాన్నే నిలిపివేశారు. అంత ఆగ్రహంలో
ఉన్న ప్రజలు కూడా ఆయన మాటను శిరసావహించి
ఉద్యమానికి విరామం ప్రకటించారంటే గాంధీజీ మాటల్లో దాగి
ఉన్న శక్తి ఎంతటిదో అర్థమవుతుంది.
కలలుగన్న భారతం
‘నా ఆకాంక్ష ఉన్నతవర్గాలు, నిమ్నవర్గాలు లేని దేశం.
అంటరానితనం, మద్యపానం, మాదకద్రవ్యాలు లేని విధంగా
నాదేశం రూపుదిద్దుకోవాలి. పురుషుల్లాగే మహిళలు కూడా
సమానహక్కులు అనుభవించగలగాలి.’ ఇదీ
మహాత్ముడు కలలుగన్న భారతదేశం.
తుదిశ్వాస విడుస్తూ "హేరామ్" అని భగవద్ధ్యానం చేశాడు. మహత్మా మీకు పాదాభి వందనములు

ఆధ్యాత్మికతలో ఆరోగ్యం_ప్రార్దన.....

సూర్య నమస్కారములు. ఆధ్యాత్మికతలో ఆరోగ్యం /ప్రార్దన!

వంటిల్లే ఫార్మసీ…Swami Vivekananda Quotes Telugu


వంటిల్లే ఫార్మసీ…
★★★★★★★
అత్యంత ప్రాచీనమైనది ఆయుర్వేదం. అలనాటి ఆయుర్వేద
భిషగ్వరేణ్యుల అపార అనుభవసారాన్ని ఉపయోగించుకుంటే మీరు మాటిమాటికీ
మందుల షాపు వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం మీరు మీ ఇంటి
డ్రాయింగ్ రూమ్ నుంచి కిచెన్ వరకు నడిస్తే చాలు… ఎన్నెన్నో పెద్ద
రోగాలూ మాయమవుతాయి. ఎందుకంటే మీ కిచెన్ను మించిన క్లినిక్
లేదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మనకు కిచెనంత దూరంలోనే అత్యంత
చేరువగా ఉన్న ద్రవ్యాలతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో
తెలుసుకునేందుకే ఈ కథనం.
ఎన్నో పరిశోధనల తర్వాత రుషిపుంగవుల
సిద్ధాంత సూత్రాల్లో రుషులు చెప్పిన
సిద్ధాంతాల్లో మచ్చుకు ఒకటి…
‘‘జగత్యేవమ్ న ఔషధమ్ నకించిత్
విద్యతే ద్రవ్యమ్…’’ అంటే… ‘ఈ
విశ్వంలో ఔషధానికి పనికిరాని
ద్రవ్యం అంటూ లేనే లేద’ని అర్థం.
వంటింట్లోని
వస్తువులూ ఇందుకు మినహాయింపు కాదు. చీటికీ మాటికీ డాక్టర్ల
చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నిత్యం వాడుకునే మసాలాద్రవ్యాలనే
వ్యాధి నిరోధకాలుగా, ఔషధాలుగా ఎలా వాడుకోవచ్చో చెప్పడానికి కొన్ని
ఉదాహరణలు.
పసుపు (హరిద్రా):
జలుబు, రొంప చేసినప్పుడు వేడి వేడి పాలల్లో చిటికెడు పసుపు,
చిటికెడు మిరియాల పొడి కలిపి తాగాలి. పసుపుకొమ్మును కాల్చి, ఆ
పొగను పీలిస్తే ముక్కుదిబ్బడ నయమవుతుంది. పసుపుముద్దను పుదీనా రసంలో
కలిపి, రాత్రి పడుకునేప్పుడు మొటిమలపై రాస్తే కొన్నాళ్లకు అవి
తగ్గిపోతాయి. బహిష్టు తర్వాత పసుపు, తేనె, నెయ్యి కలిపి సేవిస్తే
గర్భాశయ శుద్ధి కలుగుతుంది. పసుపుకు యాంటీసెప్టిక్ గుణం కలిగి ఉంది కనుక,
తాజాగా ఉన్న గాయాలపై రాస్తే రక్తస్రావం ఆగిపోయి, గాయం త్వరగా
మానుతుంది. దీనికి యాంటిబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలున్నాయని
ఆధునిక పరిశోధనల్లోనూ విదితమైంది.
వెల్లుల్లి (లశున):
దీనిలో లవణరసం తప్ప మిగిలిన ఐదు రసాలు ఉంటాయి. (అంటే… మధుర,
అమ్ల, కటు, తిక్త, కషాయ రసాలు). రెండు మూడు వెల్లుల్లి రేకలను దంచి
కప్పుడు పాలల్లో మరిగించి, కొంచెం చక్కెర కలుపుకుంటే దాన్ని ‘లశునక్షీరం’
అంటారు. వారానికి రెండు, మూడుసార్లు పరగడుపున ఒక కప్పు తాగితే వ్యాధి
నిరోధకశక్తి పెరుగుతుంది. తరచూ కనిపించే ఇన్ఫెక్షన్స్ (ముఖ్యంగా
గొంతునొప్పి)ను ఇది దరిచేరనివ్వదు. వెల్లుల్లి రక్తంలో
కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. బీపీని నియంత్రిస్తుంది.
జీర్ణక్రియను బాగుచేసి, విరేచనాలను నివారిస్తుంది. లశునక్షీరం – దగ్గు,
జలుబులకు మంచి నివారణ. కీళ్లనొప్పులు, గుండెజబ్బులు కూడా తగ్గుతాయి.
నువ్వుల నూనెలో వెల్లుల్లి రేకల్ని మరిగించి, చల్లార్చి, రెండు చుక్కలు చెవిలో
వేస్తే చెవిపోటు తగ్గుతుంది.
ఉల్లిపాయ (పలాండు):
రెండు చెంచాల ఉల్లిరసానికి తేనె, నెయ్యి, బెల్లం సమానంగా కలిపి
నిత్యం సేవిస్తే పురుషుల్లో శుక్రం అభివృద్ధి చెందుతుంది.
ఉల్లిగడ్డను కాల్చి చిటికెడు ఉప్పుతో తింటే జీర్ణశక్తి వృద్ధిచెందుతుంది.
ఉల్లిరసంలో అల్లపురసం, తేనె కలిపి సేవిస్తే జలుబు, రొంప తగ్గుతాయి.
ఉల్లిరసం, నిమ్మరసం ఒక్కొక్క చెంచా కలిపి ప్రతిరోజూ పరగడుపున సేవిస్తే
బరువు తగ్గుతారు. వేసవిలో వడదెబ్బ నుంచి కాపాడుతుంది. దీని రసంలో
కొంచెం ఉప్పు కలిపి, పంటి చిగుళ్లకు పూస్తే దంతమూల రక్తస్రావం తగ్గుతుంది.
అల్లం (అర్ద్రక):
చిన్న అల్లం ముక్కను శుభ్రంగా కడిగి, నిప్పులపై కొంచెం వేడిచేసి
కొంచెం ఉప్పును అద్ది, పరగడుపున నమిలి తింటే జీర్ణకోశ సంబంధిత
వ్యాధులన్నింటినీ పోగొడుతుంది. గొంతుకి ఇన్ఫెక్షన్ రాదు. అల్లానికి
రక్తప్రసరణను పెంచే గుణం ఉంది. దీనివల్ల గుండెకు, మెదడుకు,
మూత్రపిండాలకు, జననాంగాలకు చక్కటి రక్తప్రసరణ జరిగి హార్ట్ఎటాక్ను,
పక్షవాతాన్ని నివారించడానికి ఉపకరిస్తుంది. కిడ్నీల
పనితీరు మెరుగుపడుతుంది. పురుషాంగ స్తంభనకు దోహదపడుతుంది. అల్లాన్ని
పసుపు, తులసిరసంతో సేవిస్తే చర్మరోగాలు ముఖ్యంగా
దద్దుర్లు (అర్టికేరియా) తగ్గిపోతాయి. దీన్ని దంచి, మజ్జిగలో కలిపి
తాగితే వాతవ్యాధులు తగ్గుతాయి. నిమ్మరసంలో కొంచెం సైంధవలవణం కలిపి,
అల్లపు ముక్కలను దాంట్లో వారం రోజులు నాన్చి, ఎండబెడితే ‘భావన అల్లం’
తయారవుతుంది. దీన్ని చప్పరించి నమిలితే అరుచి తగ్గి, ఆకలి పుట్టి,
జీర్ణక్రియ బాగవుతుంది. అల్లపురసం తేనెతో సేవిస్తే దగ్గు,
ఆయాసం తగ్గుతాయి.
కరివేపాకు (కరినింబ):
రోజూ రెండు చెంచాల కరివేపాకు రసం తాగితే మధుమేహ వ్యాధి
నివారణకు ఉపకరిస్తుంది. నరాల బలహీనత తగ్గుతుంది. కడుపులో గ్యాస్
తగ్గి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణకోశ క్యాన్సర్లను నివారిస్తుంది.
జీరకర్ర (జీరక):
నిమ్మరసంలో కొంచెం సైంధవలవణాన్ని కలిపి,
జీలకర్రను వారం రోజులు నానబెట్టి ఎండిస్తే ‘భావనజీర’ తయారవుతుంది. ఇది
కొంచెం నమిలి చప్పరిస్తే ఆకలిపుడుతుంది. గర్భిణికి కలిగే వాంతులను తగ్గించి
జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. జీలకర్ర చూర్ణాన్ని పెరుగులో కలిపి సేవిస్తే
నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. జీలకర్రను వేయించి, పొడిచేసి 1-2
గ్రాములు నెయ్యితో కలిపి రోజూ సేవిస్తే బాలింతలకు స్తన్యవర్ధకంగా
పనిచేస్తుంది. జీలకర్ర, ఉప్పు కలిపి నూరి, అందులో తేనె కలిపి, తేలుకుట్టిన
చోట పూతగా పూస్తే ఉపశమనం లభిస్తుంది. జీలకర్ర, ధనియాలు,
అల్లం కలిపి కషాయం కాచి 30 మి.లీ. రోజూ తాగితే అధిక బీపీ
నియంత్రణలోకి వస్తుంది. ఈ కషాయం వల్ల వైరల్ జ్వరాలు కూడా
తగ్గుతాయి. పైల్స్ (అర్మోరోగం)కి కూడా మంచిది. జీలకర్రలో ఐరన్ ఎక్కువగా
ఉంటుంది.
ధనియాలు:
ధనియాల చూర్ణాన్ని పటికబెల్లంతో కలిపి తింటే అరుచి, అజీర్ణం,
గొంతునొప్పి, జలుబు, రొంప తగ్గుతాయి. గర్భిణులకు వాంతులు తగ్గుతాయి.
కషాయం తాగితే అధిక రక్తపోటు తగ్గుతుంది. జ్వరహరంగా పనిచేస్తుంది.
ధనియాలు, కరివేపాకు, చింతచిగురులను ఎండబెట్టి పొడి చేసి, స్వల్ప
ప్రమాణంలో సైంధవలవణం కలిపి ఆవునెయ్యితో అన్నం మొదటిముద్దతో
తింటే సమస్త జీర్ణకోశవ్యాధులు తగ్గుతాయి.
ఏలకులు (ఏలా):
ఏలకుల చూర్ణాన్ని స్వల్పప్రమాణంలోనే సేవించాలి. పటికబెల్లంతో కలిపి
చప్పరిస్తే నోటి దుర్వాసన పోతుంది. పాలలో మరిగించి, చల్లార్చి తేనెతో
వాడితే పుంసత్వ శక్తికి చాలా మంచిది. నిమ్మరసంతో సేవిస్తే
వాంతులు తగ్గుతాయి. దోసగింజల చూర్ణంతో కలిపి సేవించి అనుపానంగా
పల్లేరు కషాయం తాగితే కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. మూలవ్యాధికి కూడా
మంచిది. పాలమీగడలో కలిపి ఆ ముద్దను నోటిలో చప్పరిస్తే నాలుక, దవడ
పూత తగ్గుతుంది. ఈ చూర్ణాన్ని బట్టలో పెట్టి వాసన చూస్తే తుమ్ములు,
తలనొప్పి తగ్గుతాయి. మధుమేహానికి కూడా మంచిదే.
గమనిక: కల్తీలేని ద్రవ్యాలను మాత్రమే సమకూర్చుకోవాలి. మేలిమి
ద్రవ్యాలతో మాత్రమే ఔషధ ఫలితాలు లభిస్తాయి. వీటిని వంట
ద్రవ్యాలుగా వంటకాల్లో వాడటం వల్ల అవసరమైనప్పుడు ఔషధంగా అవి
పనిచేయవని కొందరు అపోహ పడుతుంటారు. అది వాస్తవం కాదు.
లవంగాలు (దేవకుసుమ): వీటిని వేయించి, చూర్ణించి (పొడి చేసి) తేనెతో కలిసి
తాగితే దగ్గు, కఫం తగ్గుతాయి. లవంగాలను చల్లని నీళ్లతో నూరి,
వడగట్టి, పటికబెల్లంతో సేవిస్తే కడుపులో మంట తగ్గుతుంది.
గర్భిణీలకు వాంతులు తగ్గుతాయి. లవంగతైలాన్ని పైపూతగా రాస్తే
పిప్పిపన్ను నొప్పి తగ్గుతుంది. నీటితో ముద్దగా చేసి పట్టువేస్తే
తలనొప్పి తగ్గుతుంది.
దాల్చిన చెక్క (త్వక్): దీన్ని చాలా స్వల్పప్రమాణంలోనే ఉపయోగించాలి.
చూర్ణాన్ని సేవిస్తే ఆకలిపుట్టి అజీర్తిని పోగొడుతుంది.
వాయువును హరిస్తుంది. శుక్రాన్ని పెంచుతుంది. రక్తంలో కొవ్వును కరిగిస్తుంది.
ఆవాలు (సర్షప): చాలా పుష్టికరం. ఐరన్, జింక్, క్యాల్షియం, ప్రొటీన్లు,
మాంగనీస్ వంటి పోషకాలకు నిధి. చెంచాడు ఆవనూనెలో ఒక చెంచా తేనె కలిపి
తాగితే ఉబ్బసం (ఆస్తమా) నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్లీహవృద్ధి
(స్ప్లీన్ వ్యాకోచం) తగ్గుతుంది. ఆవచూర్ణంతో ఒంటికి నలుగుపెడితే చర్మానికి
కాంతి వస్తుంది. ఆవనూనె పూస్తే తలమీద వెంట్రుకలు ఒత్తుగా పెరిగి, చుండ్రు,
పేలు పోతాయి. చూర్ణాన్ని బెల్లంతో కలిపి సరైన మోతాదులో వాడితే పిల్లల్లో
పక్కతడిపే అలవాటు (శయ్యామూత్రం-బెడ్వెట్టింగ్) తగ్గుతుంది.
మిరియాలు (మరిచ): ఈ పొడిని పాలు చక్కెరతో సేవిస్తే జలుబు,
దగ్గు తగ్గుతాయి. ఆకలి పుడుతుంది. కంఠశుద్ధి జరుగుతుంది. మిరియాలు,
జీలకర్ర చూర్ణాలను తేనెతో సేవిస్తే పైల్స్ (అర్మోవ్యాధి) తగ్గుతాయి.
తేలు, జెర్రి వంటి విషకీటకాలు కుడితే మిరియాలను ఉల్లిపాయ రసంతో
అరగదీసి చర్మంపై (కుట్టినచోట) పట్టువేయాలి. మిరియాలతో చేసిన
తైలం చర్మరోగాలను తగ్గిస్తుంది. (ఈ తైలాన్ని పైపూతగా వాడాలి).
వాము (అజామోద): దీన్ని పొడిచేసి, సైంధవ లవణంతో కలిపి, నిమ్మరసంతో
సేవిస్తే కడుపునొప్పి తగ్గి, జీర్ణక్రియ పెరుగుతుంది. వాము నమిలితే నోటి
దుర్గంధం పోతుంది. వాముకషాయం తాగితే అజీర్తి విరేచనాలు, నీళ్ల
విరేచనాలు తగ్గుతాయి.
నువ్వులు (తిల): ఆయుర్వేదంలో ‘తైలం’ అంటే నువ్వులనూనె అని అర్థం.
దీన్ని శరీర మర్దనానికి (మసాజ్) వాడవచ్చు. చర్మకాంతి పెరిగి,
బరువు తగ్గుతారు. వాతనొప్పులు తగ్గుతాయి. కడుపులోకి తీసుకోవడం వల్ల
మేదోరోగం (స్థౌల్యం) తగ్గుతుంది. కడుపులో వాయువు తగ్గుతుంది. వృద్ధాప్యంలో
వచ్చే ముడుకుల నొప్పుల నివారణకు ఉపయోగపడుతుంది. రెండు చెంచాల నువ్వుల
నూనెలో కొంచెం వేడిచేసిన ఇంగువ కలిపి గ్లాసుడు పాలతో బహిష్టు సమయంలో
తాగితే ముట్టుశూల (నొప్పి) తగ్గుతుంది. నువ్వుల పప్పును బెల్లంతో కలిపి
రోజూ తింటే శరీరానికి చక్కటి శక్తి వస్తుంది. దీంట్లో క్యాల్షియమ్ అధికంగా
ఉంటుంది.
కుంకుమపువ్వు (కుంకుమమ్): ఇది చాలా ఖరీదైన ద్రవ్యం. 200 మి.గ్రా.
ద్రవ్యాన్ని పాలు, చక్కెరతో సేవిస్తే చర్మకాంతి పెరుగుతుంది. రక్తశుద్ధి
చేస్తుంది. వాపులను తగ్గిస్తుంది. కడుపులో క్రిములు నాశనమవుతాయి.
కంటిచూపు వృద్ధికి ఉపయోగపడుతుంది. శిరోరోగాలను నివారిస్తుంది. మహిళలలో
నెలసరిని చక్కదిద్దుతుంది. పురుషత్వాన్ని పెంచుతుంది. దీనితో తయారుచేసిన
కుంకుమాదిలేపం ఆయింట్మెంట్ ఆయుర్వేద దుకాణాలతో లభిస్తుంది. దీన్ని వాడితే
మొటిమలు, చర్మం మీద రకరకాల మచ్చలు తగ్గి చర్మం నిగనిగలాడుతుంది.
బెల్లం (గుడం): దీంట్లో ఐరన్, క్యాల్షియమ్ మెండుగా ఉంటాయి. బెల్లాన్ని
మిరియాన్ని కలిపి చేసిన పానకం తాగితే ఆకలి పుడుతుంది. పెరుగుతో కలిపి
సేవిస్తే బలం కలుగుతుంది. కొన్నిసార్లు దెబ్బలు తగిలినప్పుడు గాయం కాకుండా
కేవలం వాపు, నొప్పి కలుగుతుంటాయి (స్ప్రెయిన్). ఇలాంటప్పుడు బెల్లం, శుంఠి
చూర్ణం కలిపి తింటే వాతనొప్పులు తగ్గుతాయి. బెల్లం, పసుపు, కొద్దిగా
కరక్కాయ చూర్ణం కలిపి దంచి రెండు గ్రాముల మోతాదులో తియ్యటి
మజ్జిగతో పాటు నిత్యం సేవిస్తే మొలలు (పైల్స్) తగ్గుతాయి.
తేనె (మధు): దీనికే మాక్షిక, క్షాద్ర, సారఘు వంటి పర్యాయపదాలెన్నో
ఉన్నాయి. ఇది రకరకాలైన పుష్పాల మకరందాన్ని తేనెటీగలు సేకరించి ఒక
చోట పొందుపరచడం వల్ల లభించే ద్రవ్యం. కాబట్టి వ్యాధి క్షమత్వక
శక్తిని అమోఘంగా వృద్ధి చేస్తుంది. నవజాత శిశువులకు తేనెను నాకించడంలోని
ఆంతర్యమిదే. ఇది చాలా తేలికగా, శీఘ్రంగా జీర్ణమై, శక్తిని
ప్రసాదిస్తుంది.
సమస్త స్రోతస్సులలోకి అత్యంత వేగంగా చొచ్చుకుపోతుంది. స్థౌల్యాన్ని
పోగొడుతుంది. పరగడుపున నిమ్మరసం, వేడినీళ్లతో కలిపి తాగితే మంచిది.
వీర్యాన్ని, మేధస్సును వృద్ధి చేస్తుంది. కంటిచూపు, శరీరకాంతి
మెరుగుపడతాయి. నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. ఆకలి పుడుతుంది. మొలలు,
దగ్గు, ఆయాసం, కఫం, ఎక్కిళ్లు, తృష్ణ (దప్పిక), కడుపులోని క్రిములు వంటి
వికారాలను తగ్గిస్తుంది. తేనె, సున్నం, కలిపి పట్టువేస్తే వాపులు,
సెగగడ్డలు తగ్గుతాయి. ఆయుర్వేదంలో ఇంచుమించు అన్ని
మందులకు తేనెను అనుపానంగాగాని, సహపానంగా గాని వాడుతారు.
పెరుగు (దధి) / మజ్జిగ (తక్రం): ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి
శ్రేష్ఠం. పెరుగు, మజ్జిగ చాలా బలకరం. పెరుగును మజ్జిగగా చిలికి
వాడటం వల్లనే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మజ్జిగ స్థూలకాయాన్ని
తగ్గిస్తుంది. ఆకలి పుట్టిస్తుంది. సూర్యోదయం కాకుండా తెల్లవారుఝామున
పెరుగన్నం తింటే మైగ్రేన్ తలనొప్పికి మంచి ఉపశమనం లభిస్తుంది.
మజ్జిగ, సైంధవ లవణం, వాముచూర్ణం కలిపి తాగితే ఆర్శమొలల
రక్తస్రావం తగ్గుతుంది. మజ్జిగను బార్లీ నీటితో కలిపి తాగితే మూత్రం సాఫీగా
అయి, మంటను తగ్గిస్తుంది.
గసగసాలు (అహిఫేన బీజాలు): దీన్ని చాలా జాగ్రత్తగా, అతి తక్కువ
మోతాదులో సేవిస్తే అతిసారం తగ్గుతుంది. వీర్యవృద్ధి జరుగుతుంది. ఈ
చూర్ణాన్ని కొబ్బరినూనెలో కలిపి మరిగించి, వడబోసి… ఆ మిశ్రమాన్ని
తలకి రాసుకుంటే చుండ్రు తగ్గుతుంది. శిరోభారం తగ్గుతుంది. కంటి
చూపు మెరుగుపడుతుంది.
పుదీనా ( పూతిశాక): ఇది స్వల్ప ప్రమాణంలో వాడితే ఆకలి పెరుగుతుంది.
అజీర్తి తగ్గుతుంది. కడుపులో క్రిములు, కడుపునొప్పి, గ్యాస్ తగ్గుతాయి.
దీని నుంచి తీసిన నూనెను పూతగా పూస్తే కండరాల నొప్పులు
తగ్గుతాయి.

Wednesday, January 7, 2015

Varasatva dhanam itihasamu

వారసత్వధనం ఇతిహాసం
Posted On:1/1/2015 1:15:27 AM
మనిషి జీవితం విలువ నైతికత. మనిషి ఏలాగోలా బతకాలంటే ఎలాగైనా బతకొచ్చు. ఇలాగే బతకాలంటే ధర్మాన్ని ఆశ్రయించకతప్పదు. మానవ జీవన సౌధానికి మూల స్తంభాలు ధర్మార్థ కామమోక్షాలు.
ధర్మార్థ కామమోక్షాణాముపదేశ సమన్వితమ్!
పూర్వవృత్త కథాయుక్త మితిహాసం ప్రచక్షతే!!
ప్రపంచానికి వారసత్వధనంగా, నైతిక ధార్మిక ఆశయాలకు ఆధారంగా లభించినవే రామాయణ మహాభారతాలు. ఇవి రెండూ మన పూర్వీకుల జీవిత ప్రతిభలకు సంబంధించిన సర్వస్వాలు. మనిషి సాధించాల్సిన ధర్మం-అర్థం-కామం-మోక్షం అనే పురుషార్థాలను వివరిస్తూ గతించిన ధర్మ, నైతిక, ఆదర్శ జగతిని పూర్వవృత్తంగా చెప్పే అందమైన కథే ఇతిహాసం. దీనిలో ఆదర్శ నాగరికత వర్ణించబడింది. అది తరతరాలకూ నిత్యనూతనమై మార్గనిర్దేశనం చేస్తుంది. మనిషి ఎలా ఉండాలో, మానవ సంబంధాలు ఎంత ఉన్నతమైనవో, మనిషిలో ఏర్పడిన మార్పు వ్యవస్థనూ, దేశాన్నీ, ప్రపంచాన్నీ, ఏ విధంగా మార్చేసిందో ఇలా ఒక్కటేమిటీ మానవ జీవన చిత్రం అద్భుతంగా వర్ణించబడిన ఉద్యంధం రామాయణం.

మనిషిని అల్లుకునే కుటుంబంం దాని విలువ, సమాజంలో వృత్తిలో నిర్వర్తించాల్సిన బాధ్యతలు, జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు మనిషి సాధించాల్సిన పురుషార్థాలు, భారతీయ సంస్కృతీ వైభవం మహోన్నతంగా వివరించిన మహాభారతం నేటికీ ఆదర్శం.
భారతీయులే కాక ప్రపచమంతా ఆరాధించే రామాయణ భారతాలు కేవలం గడచిపోయిన చారిత్రక వైభవం కాదు. ఆధునికత ముసుగులో అశాంతిని ఆశ్రయిస్తూ తృప్తిలేని యాంత్రికజీవనం గడుపుతున్న నేటి తరానికి మానసిక సంయమనం అందిస్తూ ఆత్మగౌరవం పెంపొందించే ఔషధ గుళికలు, మానవ జీవితానికి సౌరభాన్నద్ధి ప్రపంచమంతా నైతిక పరిమళం వెదజల్లే ఇతిహాస సుమాలు. తల్లిదండ్రులూ వారసత్వ సంపదగా పిల్లలకు రామాయణభారత గాథలు వినిపిస్తూ ఆదర్శజీవం గడిపేందుకు మార్గదర్శకం చూపించండి. మనిషి మనిషి గౌరవించే నైతికతకు ఆస్కారమివ్వండి. 

Gnanamu Acharana

జ్ఞానము - ఆచరణ
Posted On:1/2/2015 1:52:46 AM
నిద్రపోవడం, ఆహారం తీసుకోవడం, భయపడడం, సంతానాన్ని పొందడం అనేవి మానవులకు, పశుపక్ష్యాదులకు సమానమే. ఇతర ప్రాణులకన్న మానవునికి ఉన్న ప్రత్యేకమైన విశేషం జ్ఞానం.
మానవులు తమకు జన్మనిచ్చిన తల్లిదగ్గర ప్రాథమికమైన జ్ఞానాన్ని అభ్యసిస్తారు. ఆ తర్వాత తండ్రిదగ్గర, గురువుల ద్వారా, ఎన్నెన్నో గ్రంథాల ద్వారా, పరిసరాల ద్వారా, సమాజంలోని వ్యక్తుల ద్వారా ఎంతో విజ్ఞానాన్ని ఆర్జిస్తారు.
ఈ జ్ఞానం మనిషికి నిండుగా ఉండవలసిందే. అయితే జ్ఞానం ఎంత ఎక్కువగా ఉన్నా, తగిన ఆచరణ లేకపోతే ప్రకాశించదు.
జ్ఞాని ఆపదల్లో కుంగిపోకుండా, సంపదల్లో పొంగిపోకుండా, ధీరచిత్తుడై జీవితాన్ని కొనసాగిస్తేనే అతడు అభ్యసించిన జ్ఞానానికి సాఫల్యం చేకూరినట్లు.
ఏతావదేవ హి ఫలం పర్యాప్త జ్ఞాన సత్త యుక్తస్య
యద్యాపత్సు న ముహ్యతి నాభ్యుదయే విస్మితో భవతి ॥
అని ఆర్యాసప్తశతి కర్తయైన సుందరపాండ్యుడు ప్రబోధించారు.
మనిషి తాను సంపాదించిన జ్ఞానాన్ని ఆచరణలో నిలుపుకుంటేనే జీవితానికి సమన్వయం చేసుకుంటేనే జ్ఞానానికి సార్థకత ఏర్పడుతుంది. అనారోగ్యం ఏర్పడితే రోగాన్ని పోగొట్టే ఔషధం పేరును ఒకటికి పదిసార్లు పలికినా, రోగనిర్మూలనం జరుగదు.
సుచింతితం చౌషధం ఆతురాణాం న నామమాత్రేణ కరోత్యరోగంఅని కదా ఆర్యోక్తి.
రోగాన్ని పోగొట్టే శక్తిగల ఔషధాన్ని మింగితేనే అనారోగ్యం తొలగి ఆరోగ్యం సిద్ధించినట్లు, అభ్యసించిన జ్ఞానాన్ని ఆచరణలో పెడితేనే అతడు విద్వాంసుడిగా కీర్తించదగినవాడు.
యస్తు క్రియావాన్ పురుష స్సవిద్వాన్ అని చెప్పబడినది.
తన కుటుంబం యొక్క తోటివారి యొక్క సంక్షేమానికి, సంరక్షణకు తన విజ్ఞానాన్ని ఉపయోగించే విధంగా కార్యాచరణను కలిగిఉండాలి.
ఉత్తమమైన జ్ఞానాన్ని, ఉన్నతమైన ఆచరణను కలిగిఉండే మహనీయులను ఆదర్శంగా గ్రహించి, వారిని అనుసరించే ప్రయత్నం చేద్దాం.

Guname Alankaramu

గుణమే అలంకారం
Posted On:1/3/2015 1:40:21 AM
లోకంలో మంచి నేర్చుకోవడం కష్టతరం. అదే చెడును నిమిషాల్లో అక్కున చేర్చుకుంటాం. మంచిని వదిలివేయడం సులభం. కానీ చెడును విదిలించుకోవడానికి జీవితకాలమైనా సరిపోదు. సద్గుణ పరిపోషణ చేసుకోగల జీవితం ఉన్నతంగా ఎదిగి అందరికీ ఆదర్శప్రాయమవుతుంది.
గుణేషు యత్నః పురుషేణ కార్యో
న కించిదప్రాప్త్యతమం గుణానామ్!
గుణప్రకర్షాదుడపేన శమ్భోః
అలజ్ఞ్యముల్లజ్ఘిత ముత్తమాంగమ్!!
మనిషికి జీవితం ఒక్కసారే లభిస్తుంది. అందుకే మనిషి ఎల్లప్పుడూ సద్గుణాల కోసం ప్రయత్నం చేయాలి. గుణాలకు లభించనిది ఏదీ లేదు. మంచి గుణాలు ఉన్నందువల్లనే చంద్రుడు మహాశివుని శిరస్సును అలంకరించాడు. ఉన్నతమైన ఆశయసాధనలో మనం నేర్చుకునే ప్రతీ సద్గుణం ఆలంబనే. మంచి గుణాలు సత్కర్మలను ప్రేరేపిస్తాయి. దీనివలన మనిషిలో చిత్తశుద్ధి సమకూరుతుంది. అప్పుడు ప్రతీ ఒక్కరిలో భగవంతుడు కనిపిస్తాడు. మనలో లేని దేవుడు ఎదుటివారిలో ఎలా కన్పిస్తాడు. మసకబారి దుమ్ముపట్టిన అద్దంలో మన ప్రతిబింబం కనిపించినట్లే, మనస్సు అనే అద్దంపై అజ్ఞానమనే మురికి, దుర్గుణం అనే దుమ్ము పేరుకుపోతే అంతర్యామిత్వం కనిపించదు. వేసే ప్రతీ అడుగూ, నేర్చుకునే ప్రతీ గుణం, మాట్లాడే ప్రతీ మాట మనిషిని ఉన్నతదిశగా అడుగులు వేయిస్తాయి.

సంకల్పం, సద్గుణం మనిషిని మహోన్నతున్నిచేస్తాయి. సమస్తాన్నీ సమంగా చూడగలగడమే మహాగుణం. ఎప్పుడైతే సమభావన మనసులో నెలకొంటుందో అప్పుడే భేషజాలకు, ద్వేషాలకు, కుటిలతకు, కుసంస్కారానికీ తావుండదు. మంచినే నేర్చుకునే ప్రతీ గుణం సోపానమై మానవ జీవిత శిఖరాన్ని ఉన్నతంగా, ఉత్తమంగా దర్శింపజేస్తుంది.

Nutana Oravadi

నూతన ఒరవడి
Posted On:1/6/2015 12:19:31 AM
ఒక మహావృక్షములో మంచి రుచికరమైన పక్వఫలం ఉంది. ఆ పండు నేలరాలి, దాని విత్తు వేరు పాతుకొని భావికాలపు వృక్షంలా అంకురిస్తుంది. ఈ నూతన వృక్షం బహుశా మొదటిచెట్టు కంటే మహోన్నతమైంది కావచ్చు! బ్రహ్మాండమైన కాలంలో మరో నూతన వృక్షం ఆవిర్భవించింది. గతించిన వైభవాన్ని ఆశానిరాశలతో జ్ఞాపకం చేస్తూ కనులవిందు చేస్తున్న నూతన పర్వాన్ని కాలమనే మహత్తునుంచి స్వీకరించి అందులో జీవిద్దాం.
కాలః సర్వం సమాదత్తే కాలః సర్వం ప్రయచ్ఛతీ!
కాలేచ విహితం సర్వం మాకృథా శక్రపౌరుషమ్‌॥

కాలమే అన్నింటికీ ఆధారం. కాలమే అన్నింటికీ అవకాశం. మనం నిమిత్తమాత్రులం మాత్రమే. కనుక కాలమనే రూపసౌందర్యాన్ని పులుముకొని విచ్చేసిన నూతన ఒరవడి నీడలోకి విశాల దృక్కోణపు ఆలోచనలు తోడురాగా, నూతన ఉత్తేజంతో ఆనందంగా జీవించేద్దాం.
బంగారానికి తావి అబ్బినట్లు అనేది ఒక అందమైన ఊహ! కట్ట తెంచుకొని ప్రవహించే కాలంలో కమ్మని, చేదు అనుభవాలు మిళితమై ఉంటే అది ఒక అరుదైన నిజం. ఆ ఊహ, ఈ నిజం కలిసి మూర్తీభవిస్తే అదే నూతన ఒరవడి. భవిష్యత్తుకు ప్రాణం పోసే జీవననాడి.
గడచిన కాలం ద్వారా మనసులో నింపుకున్న అనుభవంతో ఆగామి కాలంలో అతీత స్థితికి ఎదిగిపోవాలి. సత్యం కల్పన కంటే కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో, అది ఈ జీవితాన్ని అర్థవంతం చేస్తుందో నిర్ధారించుకొని ముందుకు సాగడమే మన కర్తవ్యం.
జరిగినదంతా మంచే జరుగుతున్నదీ మంచిదే. జరుగబోయేదీ మంచికే. కనుక భూత, భవిష్యత్ చింతనలను వదిలి వర్తమానాన్ని ఆస్వాదిస్తూ జీవించాలి. వర్తమానాన్ని గత అనుభవ వివేకంతో గడిపితే తప్పక ఉజ్వల భవిష్యత్తు లభిస్తుంది. మానవ నైజం మీద చరిత్ర రాసిన నిందా లేఖనం చెరిపేసి నూతన ఒరవడిలో ఆదర్శ అధ్యాయాలను లిఖించే వేదికవ్వాలి కాలం. ఇదే కాలమిచ్చే అపూర్వ సందేశం.

Mahatmulu Yekarupulu

మహాత్ములు ఏకరూపులు
Posted On:1/7/2015 12:11:03 AM
సత్కార్యాచరణ తత్పరులై అనితర సాధ్యమైన రీతిలో జీవనయానాన్ని కొనసాగించే మహాత్ములు కష్టసుఖాల్లో, జయాపజయాల్లో, లాభనష్టాల్లో సమచిత్తులై ఏకరూపులై ఉంటారు. మహాత్ములు ఆపదలు వచ్చినప్పుడు కుంగిపోరు. సంపదలు వచ్చినప్పుడు పొంగిపోరు. దూరాన్ని లెక్కించరు. అవలీలగా సముద్రలంఘనం చేస్తారు. పర్వతాల్నీ అధిరోహిస్తారు. తమకేదీ అసాధ్యం కానట్లుగా మహోన్నత లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. లక్ష్యసాధన దిశగా అడుగులేస్తారు. సమున్నత ఫలితాలను పొందుతారు.
తమ తమ ప్రతిజ్ఞలకు అనుగుణంగా మహత్కార్యాలను ఆరంభించేప్పుడు సుఖ సంపదలను, కీర్తిప్రతిష్ఠలను కాంక్షించరు. ఏవైనా అడ్డంకులు వచ్చినా, అధైర్యపడక సంకల్పించిన కార్యాన్ని నెరవేర్చుటకై దీక్షబూనుతారు.
మహాత్ములు స్తుతినిందలకు, లోభ మోహాలకు అతీతులు. మహారాజ్యాన్ని, మహారణ్యాన్ని ఒకేవిధంగా భావిస్తారు. శ్రీరామచంద్ర ప్రభువు లక్ష్మణస్వామితో-నేను రాజ్యలక్ష్మిని కోల్పోయానని బాధపడకు. నాకు రాజ్యాధికారం కన్నా పితృవాక్య పరిపాలనకై చేసే వనవాసమే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది - రాజ్యం వా వనవాసో వా వనవాసో మహోదయః అని పేర్కొన్నాడు.

అవికారులు, సమచిత్తులు అయిన మహాత్ములలో అగ్రగణ్యుడు శ్రీరామచంద్రుడే. తనను త్వరగా అడవికి పంపాలని తొందరపడుతున్న కైకేయితో శ్రీరామచంద్రుడు - నేను సంపదలకు ఆశపడేవాడిని కాను (నాహమర్థపరో దేవి) అని తెలిపినాడు. నేను ఆడిన మాటను తప్పేవాడను కాను. మేరుమందర పర్వతములతో సరితూగే ధనరాశులను, అరణ్యమునందలి గడ్డిపరకలను సమానంగా భావించే ఋషుల కోవకు చెందినవాడను (విద్ధి మాం ఋషిభిస్తుల్యమ్). కోపగించకు, నేను నారవస్త్రాలను, జటలను ధరించి వెంటనే అరణ్యానికి బయలుదేరుతాను. నీవు సంతోషంగా ఉండుము అని పలికినాడు.
అంతఃపురంలో హంసతూలికా పాన్పుపై నిదురించవలసిన శ్రీరామచంద్రుడు అరణ్యంలో కటిక నేలపై నిదురించాడు. పట్టు వస్త్రాలను ధరించి, పంచభక్ష్య పరమాన్నాలను ఆరగించాల్సి యుండగా నారవస్త్రాలను ధరించి కంద మూలఫలాల్ని భుజించాడు. మహోన్నత కార్యాలను నిర్వర్తించే మహాత్ములు ఎప్పుడూ తమ కష్టసుఖాలను లక్ష్యపెట్టరు అనే విషయాన్ని తన ఆచరణలో చూపెట్టాడు.
కష్టసుఖాల్లో ఏకరూపులుగా ఉండే మహాత్ములయొక్క మార్గాన్ని అనుసరించేందుకు ప్రయత్నిద్దాం.

sri ramana maharshi suktulu_Atmavicharana_VineelakashamloVintakanthi

శ్రీ రమణ మహర్షి సూక్తులు_ఆత్మవిచారణ_
వినీలాకాశంలో వింతకాంతి
download link: 
https://www.scribd.com/doc/251941186/Sri-Ramana-Maharshi-Suktulu-Atmavicharana-VineelakashamloVintakanthi

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular