జరాసంధుని జన్మవృత్తాంతం

జరాసంధుని జన్మవృత్తాంతం
Posted On:1/10/2015 12:08:00 AM
ఓ ధర్మరాజా ! కొంత కాలానికి ముందు మగధ దేశాన్ని బృహద్రధుడను రాజు రాజ్యము పాలిస్తూ ఉండేవాడు. మూడు అక్షౌహిణుల సైన్యము కలిగియుండేవాడు. వీరుడు, ధనవంతుడు, రూపవంతుడు, శక్తి సంపన్నుడు, యజ్ఞములు చేయువాడుగా యుండెను. అతడు తేజశ్శాలిగా, క్షమాశీలుడిగా, దండధీరునిగా ఐశ్వర్యశాలిగా యుండెను. అతడు కాశీరాజు ఇద్దరు కుమార్తెలను వివాహమాడి సమదర్శిగా ఉందునని మాట ఇచ్చెను.
ఎంతకాలము గడిచినను సంతానలేమి కారణముగా బృహద్రధుడు కుంగిపోసాగెను.

ఈ లోపుగ సత్యవాదియైన చండ కౌశిక ఋషి ఒక చెట్టు కింద నివాసమేర్పరచుకున్నాడని తెలిసిరాజు రాణుల యుక్తముగా వెళ్ళి దర్శించుకొనెను. రాజు ఇచ్చిన కానుకలతో సంతుష్టడైన ఋషి వరము కోరుకొమ్మనెను. వరముతో నేనేమి చేయగలను, నాకు కుమారున్ని ప్రసాదించుమని ప్రార్థించె ను. అదే సమయములో చెట్టుపై నుండి ఒక పండు ఋషి ెక్క ఒడిలో పడెను. ఋషి ఆ పండును రాజుకిచ్చి రాజధానికి వెళ్లిపొమ్మని చెప్పెను. రాజు తన నివాసమునకు వచ్చి ఆ పండును రాణులకిచ్చెను.
వారు చెరి సగము కోసికొని తినిరి. సంయోగ వశమున వారిద్దరికి గర్భములు నిలిచెను. రాజు ఆనందానికి హద్దులు లేకుండాపోయినవి. నిర్ణీత సమయములో ఇద్దరు రాణులు ప్రసవించిరి. వారిద్దరు కూడా సగం సగం శిశువు చొప్పున ప్రసవించి భయాందోళనకు గురైరి. ఒక్కొక్కరికి ఒకటే కన్ను,ఒకటే భుజము, ఒకటే కాలు, సగం పొట్ట, సగం నోరు మరియు సగం నడుముతో జన్మించిరి. భయముతో వణికి పోయిన రాణులు దాసీలకు చెప్పి ఆ శిశువు అర్థ శరీరాలను అంతఃపురము బయట సజీవముగా పడవేయించిరి.
ఓ ధర్మజా ! ఆ రాజధానిలో జరా అను ఒక రాక్షసి ఉండేది. అది రక్త మాంసాలు రుచి తెలిసి నదైయుండేది. ఆ శిశువు రెండు భాగాలను లేవనెత్తి, సౌకర్యముగా తీసుకెళ్లటానికి వాటిని కలిపె ను. ఇంకేముంది, చూస్తుండగానే మహా పరాక్రమవంతుడైన, మహా బలుడైన రాజ కుమారుడిగా మారిపోయేను. వజ్రకర్కశ శరీరుడైన ఆ శిశువు నోట్లో వ్రేలు పెట్టుకొని ఏడ్వసాగెను. ఆ శబ్దము విని రాణులు, రాజు బయటకు వచ్చిరి. ఆ జరా అను రాక్షసి ఇట్లాలోచించ సాగెను- నేను ధార్మికుడైన ఈ రాజు ఏలుబడిలో ఉన్నాను.
కావున ఈ శిశువును నాశనం చేయకూడదు అని రాజును ఉద్దేశించి, ఆ పాటికే మానవ స్త్రీగా మారిన జరా రాక్షసి ఇట్లనెను- రాజా ! ఈ మీ కుమారున్ని తీసుకొండి, నేను రక్షించాను అనగానే రాణులిద్దరు ఆ శిశువును అందుకొనిరి. మానవ రూప ధారిణియైన రాక్షసిని రాజు ఇట్లడిగెను- ఎవరు దేవీ నీవు? రాజా ! నేను జరా అను రాక్షసిని, మీకు బాలున్ని అప్పగించాను అని అంతర్థానమె్యును. రాజు తన కుమారునికి నామకరణము చేయునప్పుడు జరా రాక్షసి పేరు మీదుగా, అది రెండు శరీరపు ముక్కలను కలిపింది కాబట్టి జరాసంధుడు అని పేరు పెట్టెను.

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Download Sri Ayyappa Bhajanalu - Ayyappa Swamy Devotional Telugu Mp3 Songs