Tuesday, November 8, 2016

రోజు ఇంట్లో దీపం పెట్టెటప్పుడు ......

రోజు ఇంట్లో దీపం పెట్టెటప్పుడు ......!!

దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు.
అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి
ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి
శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపుకుంకుమ చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. (ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే, రోజు మాములుగా దీపం వెలిగించి, పర్వటి రోజులు, సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి.)
దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండు వత్తులైనా వేయాలి, అనగా రెండు వత్తులని కలిపి వేయాలి, విడివిడిగా కాదు.. రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు.దీపారాధానకు ఆవునెయి ఉత్తమం, తరువాత నువ్వులనూనె. దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి. సర్వదేవతస్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి. చిన్న బెల్లం ముక్క కానీ, పటికబెల్లం పలుకులు కానీ, ఏదో ఒక పండుగానీ, లేక అందుబాటులో ఉన్నది దీపానికి నివేదన చేయాలి.
ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంట లక్ష్మీ ఎప్పటికి నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు స్వయంగా గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.

దీపారాదన విధి - మహత్యం........!!
ఓ రాజ శేష్ట్రుడా! ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులూ పరమేశ్వరుని, శ్రీ మహా విష్ణువును, పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో, అట్టి వానికి అశ్వమేథ యాగము చేసిన౦త పుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి, వత్తులు చేయవలెను. వరి పిండితో గాని, ప్రమిద వలె చేసి వత్తులు వేసి, ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యి నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు వచి౦పవలెను.
శ్లో|| సర్వ జ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సు ఖవాహం
దీపదానం ప్రదాస్యామి శాంతి రాస్తూ సదామమ||
అని స్తోత్రం చేసి దీపం దానం చేయవలెను. దీని అర్ధ మేమనగా , ' అన్ని విధముల జ్ఞానం కలుగ చేయునదియు, సకల సంపదలు నిచ్చునది యగును ఈదీపదానము చేయు చున్నాను. నాకు శాంతి కలుగుగాక! ' అనిఅర్ధము ఈ విదముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయ వలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణుల కైననూ బోజన మిడి దక్షణ తాంబూలముల నివ్వ వలెను. ఈ విధంగా పురుషులుగాని, స్త్రీలుగాని యే ఒక్కరు చేసిన నూ సిరి సంపదలు, విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖి౦తురు. దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు. దానిని వివరించెద నాలకి౦పుమని వశిష్టుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.
* లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట
పూర్వ కాలమున ద్రావిడ దేశమున౦దొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు, అక్కడనే భుజించుచు, ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విదముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టు కొనుచు, దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులకు తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు- సొమ్ము కుడబెట్టుకొనుచుండెను. ఈ విదముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసి పనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించు చుండెను. ఎంత సంపాదించిననేమి? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని, దేవుని మనసార ధ్యాని౦చుట గాని చేసి యెరుగుదురు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్ధయాత్రలకు వెళ్ళే వారిని జూచి అవహేళన చేసి, యే ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యము పెట్టక తను తినక ధనము కూడాబెట్టుచు౦డెడిది.
అటుల కొంత కాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గ మధ్యమున ఈ స్త్రీ యున్న గ్రామమునకు వచ్చి, ఆ దినమున అక్కడొక సత్రములో మజిలి చేసెను. అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని అమెకడకు వెళ్లి' అమ్మా! నా హితవచనము లాలకి౦పుము. నీకు కోపము వచ్చిన సరే నేను చెప్పుచున్న మాటలను అలకి౦పుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో యెవరూ చెప్పలేరు. పంచ భూతములు, సప్త ధాతువులతో నిర్మించ బడిన ఈ శరీరములోని ప్రాణము- జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును.
అటువంటి యి శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన . తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మ మగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించు చున్నాడు. కాన, నా మాట లాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పు డైన పేదలకు దానధర్మములు చేసి, పుణ్యమును సంపాదించు కొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మోక్షము నొందుము. నీ పాప పరిహరర్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాత: కాలమున నది స్నాన మాచరించి, దాన ధర్మముల జేసి, బ్రాహ్మణులకు బోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొంద గల'వనివుపదేశమిచ్చేను.
ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచు కార్తీక మాస వ్రత మాచరించుటచే జన్మ రాహిత్యమై మోక్షము కావున కార్తీక మా సవ్రతములో అంత మహత్యమున్నది.

మట్టి ప్రమిదల్లో దీపాలని వెలిగిస్తే కలిగే ఫలితాలు......!
...........................,...........................
*మట్టి ప్రమీదల్లో దీపాలను వెలిగిస్తే ఆ ఇంటికి దృష్టి , మాత్రికుల భాద వుండధు .
*ఇంట్లో శుభకార్యాలు ఎక్కువ అవుతాయి
*గురువుల , దేవతల అనుగ్రహము ఎప్పుడు వుంటుంది.
*కార్తిక సోమవారము శివుని దేవాలయము లో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే శివుని అనుగ్రహము తో పాటు సాయుజ్యం లభిస్తుంది .
*విష్ణు దేవాలయము లో మట్టి ప్రమిదలో దీపాలను వెలిగిస్తే వైకుంఠ సాయుజ్యం లభిస్తుంది ...
*మట్టి ప్రమిదలను వెలిగించి దుర్గా సప్తశతీ పారాయణము తో పాటు దీప నమస్కారాలు చేస్తే తలచుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి .
*దేవుని ముందు అఖండ దీపానికి పెదా మట్టి ప్రమిదలో ఎవరు అయితే దీపాలను వెలిగిస్తారో వారికి దైవ భక్తి వృద్థి అవుతుంది .
*ఎవరు అయితే దేవునికి పింగాణి ప్రమిదల్లో దీపాలను వెలిగిస్తారో వారికి , వారి ఇంట వాహన యోగం వృద్ది అవుతుంది .
*పింగాణి , మట్టి ప్రమిదలను దేవుని ముందు , ఇంటి బయట వెలిగిస్తారో వారికి సమస్తమైన పాపాలు నివారణ అయి భగవంతుని అనుగ్రహము కలుగుతుంది .
*పింగాణి ప్రమిదల దీపాలని వెలిగించడం ద్వారా ఇంట్లో అన్నీ కార్యాలు నెరవేరతాయి .


దీపం ఎలా వెలిగించాలి ?
......................................................
* స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు.
* అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు.
* ఒకవత్తి దీపాన్ని చేయరాదు. ఏక వత్తి శవం వద్ద వెలిగిస్తారు.
* దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి.
* దీపారాధన మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి.
* విష్ణువుకు కుడివైపు ఉంచాలి. ఎదురుగా దీపాన్ని ఉంచరాదు.
* దీపం కొండెక్కితే “ఓమ్ నమః శివాయ ” అని 108 సార్లు జపించి దీపం వెలిగించాలి. ప్రమిద లేక కుండీలో రెండు వత్తులు వేసి దీపం వెలిగించడం శుభసూచకం. ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మా.
* శవం తల వెనుక,శ్రాద్దకర్మలప్పుడు ఒకే వత్తి వెలిగిస్తారు. అంటే జీవుడు పరమాత్మలో కలిశాడని అర్ధం ఇక దీపారాధనలో నూనె శనికి ప్రతినిధి.
* దీపం సూర్యునికి ప్రతీక, మనకు, మన ఇంటికీ వుండే దోషాల నివారణార్ధం మనకు వెలుగు (తెజస్సు ) కలగాలని, నూనె హరించినట్లే మన కష్టాలు హరించి, వెలుగు రావాలని దీపారాధన ప్రధాన ఉదేశ్యం.
* సూర్యాస్తమయం నుంచి సూర్యోదయందాకా, దీపమున్న ఇంటిలో, దారిద్ర్యముండదు.
* దీపాలు తూర్పుముఖంగా వుంటే ఆయువు పెరుగుతుంది.
* ఉత్తరదిశ ముఖంగా వుంటే అన్ని విధాలా ధనాభివృద్ధి కలుగుతుంది.
* నాలుగు దిక్కులలో ఒకేసారి దీపాలు పెడితే ఏ దోషము వుండదు.
* మంచి పత్తితో చేసిన దేవునికి దీపారాధన చేస్తే ఇంట్లో గల పితృదేవతలకు దోషాలు తొలగిపోతాయి.
* తామర తూడులతో వత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి అప్పుల బాధ తొలగిపోతుంది.
* అరటినార వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది.
* జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుంది. అధిక సంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగిపోతుంది.
* పసుపురంగు బట్టలతో దీపారాధన చేయడం వలన జఠర, ఉదర వ్యాధుల, కామెర్ల రోగం తగ్గుతాయి.
* కుంకుమ నీటితో, దానిలో తడిపిన బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన వైవాహిక చింతలు తొలగిపోతాయి. ఇంటిపై మాంత్రిక శక్తులు ఏమీ పనిచేయవు.
* సంతాన గోపాలస్వామికి దీపారాధన చేస్తే అనుగ్రహంతో సంతానం కలుగుతుంది.
* వత్తులను పన్నీటిలో అద్ది నేతితో దీపారాధన చేయడం వలన శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహం ఉంటుంది.


దేవరుణం ఎలా తీర్చుకోవాలి ......!!
రుణ శేషం, శత్రు శేషం ఉండకూడదు అంటారు. ఈ జన్మలో ఎవరికైనా రుణపడితే, వచ్చే జన్మలో వాళ్ళ ఇంట్లో కుక్కగా పుట్టి ఆ బాకీ తీర్చుకుంటామని పెద్దలు చెప్తుంటారు. ఇంతకీ రుణం అంటే ఇమిటి? బంధుమిత్రుల వద్ద డబ్బు అప్పుగా తీసుకోవడం అని మాత్రమే చాలామందికి తెలుసు. కానీ మరొకరి వస్తువులు లేదా పదార్ధాలు తీసుకుని, తిరిగి ఇవ్వకున్నా అది కూడా బాకీపడటమే అవుతుంది. ఈ సాధారణ రుణాల సంగతి అలా ఉంచితే అనుబంధాల రీత్యా కూడా ఋణపడతాం. ఈ రుణానుబంధాల్లో మొదటిది దేవరుణం.
జీవరాశుల్లోకెల్లా ఉత్కృష్టమైంది మానవ జన్మ. ఎందుకంటే, మనిషికి మాత్రమే మనసు, మేధస్సు ఉన్నాయి. మరి ఇంత ఉన్నతమైన మానవజన్మను మనకు ప్రసాదించిన దేవుడికి తప్పకుండా రుణపడతాం. అందువల్ల దేవ రుణం తప్పకుండా తీర్చుకోవాలి. అది మన కర్తవ్యం.
దేవుడు మనకు కేవలం జన్మను మాత్రమే ఇవ్వలేదు. ప్రకృతిని ప్రసాదించాడు. జీవితంలో కావలసినవన్నీ ఇస్తున్నాడు. నలుసంత గింజలో వట వృక్షాన్ని ఇమిడ్చాడు. మన శరీర ప్రక్రియను మించిన అద్భుతమైన యంత్రం ఉందా? మరి ఈ అపురూపమైన మానవజన్మను సక్రమంగా వినియోగించుకుంటే సుఖం, శాంతి ఉంటుంది. మన పుట్టుక సార్ధకమౌతుంది.
దేవ రుణం ఎలా తీర్చుకోవాలి అంటే, దేవునికి సంపదలేం సమర్పించనవసరం లేదు. ఆరాధనతోనే రుణం తీర్చుకోవాలి. రోజూ సంధ్యావందనం చేయాలి. సంధ్య సమయంలో తప్పనిసరిగా యజ్ఞ కర్మ ఆచరించాలి. సమిధలు, మూలికల మిశ్రమం, ఆవునెయ్యి ఉపయోగించి, యజ్ఞ కర్మ ఆచరించాలి.
యజ్ఞ కర్మ వల్ల మానసిక శాంతి కలగడమే కాదు, వాతావరణ కాలుష్యం నివారణ అవుతుంది. యజ్ఞగుండం ద్వారా వచ్చే పొగలు వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని పోగొట్టి, స్వచ్చతకు దారితీస్తాయి. దీనివల్ల అతివృష్టి, అనావృష్టి సమస్యలు ఏర్పడవు.
కనుక యజ్ఞ కర్మ చేసే వ్యక్తి మాత్రమే కాదు, ఇల్లు, పరిసరాలు బాగుపడతాయి. చుట్టుపక్కల ప్రజలందరూ లబ్ధి పొందుతారు. పంటలు సమృద్ధిగా పండుతాయి. పశుపక్ష్యాదులు బాగుంటాయి. అంటువ్యాధులు వ్యాపించవు. అనారోగ్యాలు దరిచేరవు. అందుకే మన ఇతిహాసాలు, పురాణాల్లో హోమాలు, యజ్ఞాల ప్రస్తావన తరచుగా కనిపిస్తుంది.
ఇప్పుడు యజ్ఞం చేసేవారు అరుదైపోయారు. ఎప్పుడో నూటికికోటికి ఒకసారి యజ్ఞం మాట వినిపిస్తుంది. కానీ, ఇది సరికాదు. యజ్ఞం వల్ల ఒనగూరే లాభాల గురించి తెలిసిన తర్వాత అయినా యజ్ఞ కర్మ నిర్వహించడానికి ముందుకు రావాలి. యజ్ఞయాగాదులు చేయడమేంటి... మనం రాజుల కాలానికి వెళ్తున్నామా అనే అపోహ నుంచి బయటపడాలి. యజ్ఞాలు నిర్వహిస్తే, మనము, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. యంత్రాలు, వాహనాల వల్ల పేరుకుపోతున్న కాలుష్యాన్ని కొంతయినా నిరోధించగల్గుతాం. యజ్ఞయాగాదులు నిర్వహించడం ద్వారా దేవరుణం తీర్చుకున్నట్టు అవుతుంది అని చెప్తున్నాయి పురాణాలు. ఒకరకంగా దేవ రుణం తీర్చుకోవడం అంటే, మనకు మనం మేలు చేసుకోవడమే! కాదా, మీరే చెప్పండి?

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular